దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు డాక్టర్ కృతిక రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భర్త మహేందర్ రెడ్డికి కోర్టు బెయిల్ నిరాకరించడం దర్యాప్తులో కిలక మలుపు తిరిగింది. పోలీసులు సేకరించిన డిజిటల్ ఆధారాలు కేసును మరింత బలపరుస్తున్నాయి.
మంగళవారం సెషన్స్ కోర్టు ముందు విచారణకు వచ్చిన ఈ కేసులో, నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు మహేందర్ రెడ్డికి బెయిల్ నిరాకరించింది. దీంతో అతడు మరింత కాలం న్యాయ పరిరక్షణలోనే ఉండాల్సి వస్తోంది.
ఈ కేసులో వెలుగులోకి వచ్చిన డిజిటల్ ఆధారాలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో మహేందర్ రెడ్డి తన భార్యను తానే హత్య చేసినట్లు అంగీకరిస్తూ పంపినట్లుగా ఉన్న మెసేజ్లు గుర్తించినట్లు సమాచారం. ఈ మెసేజ్లు కేసులో కీలక సాక్ష్యాలుగా మారనున్నాయి.
వైద్యుడైన మహేందర్ రెడ్డి తన వైద్య పరిజ్ఞానంతో ఆపరేషన్ థియేటర్లలో ఉపయోగించే ప్రొపోఫాల్ అనే అనస్తీషియా మందును అధిక మోతాదులో మృతురాలికిచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతొ కృతిక రెడ్డి మరణం సహజ మరణం కాదని, ఇది ముందుగానే పన్నిన హత్యగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మృతి
సహజ మరణంగా చూపించేందుకు మహేందర్ రెడ్డి ప్రయత్నించినట్లు కూడా దర్యాప్తులో తేలింది.
కుటుంబ సభ్యులు, సన్నిహితులు వ్యక్తం చేసిన సందేహాల నేపథ్యంలో పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత సేకరించిన ఆధారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో కేసు హత్యగా మారింది.
ప్రస్తుతం పోలీసులు కేసుకు సంబంధించిన మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. మహేందర్ రెడ్డి పంపినట్లు భావిస్తున్న మెసేజ్ల నిజానిజాలను నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ విశ్లేషణ కూడా కొనసాగుతోంది. మహేందర్ రెడ్డితో పాటు ఎవరైనా ఈ హత్యలో భాగం పంచుకున్నారా అనే కోణం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





