నగరంలోని బేగంపేట ప్రాంతంలో ఉన్న ఒక పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చోటుచేసుకున్న ఘోర ఘటన స్థానికంగా కలకలం రేపింది. శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయుడే విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడాడు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్న ఒక యువతిపై అదే సంస్థలో పనిచేస్తున్న నసీముద్దీన్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని, కేరళకు చెందిన ఇతను గత ఏడాది జనవరిలో శిక్షణ ఇస్తాననే సాకుతో బాధితురాలిపై మొదటిసారి అత్యాచారం చేసినట్లు తెలిసిందన్నారు.
ఆ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను తీసుకున్న నిందితుడు, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తూ బాధితురాలిని బ్లాక్మెయిల్ చేశాడు. ఈ వీడియోలను అడ్డం పెట్టుకుని పలుమార్లు ఆమెపై లైంగిక దాడులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి వేధింపులను భరించలేక బాధితురాలు చివరకు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. బేగంపేట పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనలో సల్మాన్ అనే మరో వ్యక్తి కూడా నిందితుడికి సహకరించినట్లు బాధితురాలు పేర్కొంది. అతనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపింది.
పోలీసులు ప్రధాన నిందితుడు నసీముద్దీన్ను అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. కేసులో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బాధితురాలి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆమె వివరాలను గోప్యంగా ఉంచినట్లు పోలీసులు వెల్లడించారు.





