గత 39 రోజులుగా అమెరికా, ఇరాన్ మధ్యకొనసాగుతున్న భీకర యుద్ధానికి తాత్కాలికంగా విరామం పడింది. అంతర్జాతీయ వేదికపై తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన ఈ యుద్దం రెండు వారాల పాటు విరామం తీసుకోవడంతో యావత్తు ప్రపంచం ఉపిరి పీల్చుకుంది. ఇరు దేశాలు పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రపంచ దేశాలకు కాస్త ఉపశమనం లభించింది.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన దేశ సైనిక విభాగాలకు వెంటనే కాల్పులను నిలిపివేయాలని ఆదేశాలను జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు భూసేన, నౌకాదళం, వైమానిక దళం అన్ని యుద్ధ చర్యలను తాత్కాలికంగా నిలిపివేశాయి. అయితే, ఈ నిర్ణయం యుద్ధానికి ముగింపు కాదని, కేవలం చర్చల కోసం ఇచ్చిన విరామమని ఇరాన్ స్పష్టం చేసింది. కాల్పుల విరామణ ప్రకటించినప్పటికీ మేం యుద్దానికి సిద్దంగానే ఉన్నామన్నారు.
ఈ కాల్పుల విరమణ రెండు దేశాల మధ్య భవిష్యత్ చర్చలకు మార్గం సుగమం చేయడానికి తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమైనప్పటికీ, పరిస్థితులు ఎప్పుడైనా మళ్లీ ఉద్రిక్తతలకు దారితీయవచ్చని వారు హెచ్చరించారు.
ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నది ఏమిటంటే, తమ దేశం యుద్ధాన్ని ఆపినప్పటికీ అప్రమత్తతను మాత్రం తగ్గించలేదని. “మా చేతులు ఇంకా ట్రిగ్గర్పైనే ఉన్నాయి. అమెరికా లేదా ఇజ్రాయెల్ చిన్న తప్పు చేసినా పూర్తి స్థాయిలో ప్రతిస్పందిస్తాం” అని వారు హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా మరోసారి ఆందోళనలను కలిగిస్తున్నాయి.
ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం యుద్ధానికి నాంది పలికింది. ఈ ఘటన తర్వాత ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతీకార చర్యలకు దిగింది. దీంతో రెండు దేశాల మధ్య ఘర్షణలు రోజురోజుకీ పెరిగి, పూర్తి స్థాయి యుద్ధంగా మారాయి.
యుద్ధం కొనసాగిన 39 రోజుల్లో ఇరు దేశాలకు భారీ నష్టం సంభవించింది. సైనిక స్థావరాలు, కీలక మౌలిక సదుపాయాలు లక్ష్యంగా దాడులు జరగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రపంచంలోని పలు దేశాలు ఈ యుద్ధాన్ని ఆపాలని పిలుపునిచ్చినా, ఎలాంటి ఫలితం కనిపించలేదు.
అయితే ఇప్పుడు ప్రకటించిన ఈ కాల్పుల విరమణతో పరిస్థితులు కొంత చల్లబడే అవకాశముంది. ఇరాన్ అధికారులు తమ యుద్ధ లక్ష్యాలను దాదాపుగా సాధించామని ప్రకటించడం గమనార్హం. “శత్రువును చారిత్రక ఓటమి అంచున నిలబెట్టాం” అని వారు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు యుద్ధం తర్వాతి రాజకీయ పరిస్థితులపై కూడా ప్రభావం చూపే అవకాశముంది.
ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఈ విరమణను స్వాగతిస్తున్నప్పటికీ, భవిష్యత్తు పరిణామాలపై అప్రమత్తంగా ఉన్నాయి. ఈ రెండు వారాల విరామం తర్వాత చర్చలు ఫలప్రదంగా సాగుతాయా? లేక మళ్లీ యుద్ధం ప్రారంభమవుతుందా? అన్నది విషయాన్ని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.





