దేశ సరిహద్దుల్లో క్లిష్ట పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, అక్రమ వలసలు, నకిలీ కరెన్సీ, వన్యప్రాణులకు సంబంధించిన నేరాలు, ఇతర వ్యవస్థీకృత నేరాలను సమర్థవంతంగా అడ్డుకుంటున్న ఘనత సశస్త్ర సీమా బల్ (SSB) దేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం, ఆధునిక పద్ధతుల్లో సరిహద్దు నిర్వహణను ఎస్ఎస్ బి ముఖ్యమైన ప్రాధాన్యతల్లో చేర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహాంపట్నం సమీపంలో 50 ఎకరాల విస్తీర్ణంలో సశస్త్ర సీమా బల్ నూతనంగా నిర్మించిన 48 జవాన్ల నివాస భవనాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. అధికారులతో కలిసి నూతనంగా నిర్మించిన గ్రుహ సముదాయాలను పరిశీలించారు. జవాన్లకు అందిస్తున్న సౌకర్యాలను, సంక్షేమ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర మంత్రితోపాటు సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింఘాల్, సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ బీ జవాన్లను ఉద్దేశించి కేంద్ర మంత్రి చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
ఈ రోజు సశస్త్ర సీమా బల్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నం ప్రాంగణంలో నిర్మించిన 48 ప్రత్యేక కుటుంబ నివాస గృహాలను ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ నివాస గృహాల నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో కృషి చేసిన అధికారులు, ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలు, ఇతర సిబ్బంది అందరికీ ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ 48 ప్రత్యేక కుటుంబ నివాస గృహాలు కేవలం భవనాలు మాత్రమే కావు. మన కేంద్ర సాయుధ పోలీసు బలగాల జవాన్లు, వారి కుటుంబాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, నిబద్ధతకు ఇవి ప్రతీక.
దేశ సరిహద్దుల్లో నిలబడి దేశ భద్రతను కాపాడే జవాన్ కుటుంబం సురక్షితంగా, గౌరవంగా, సౌకర్యవంతంగా జీవించేలా చూడటం ప్రభుత్వం, సంస్థ బాధ్యత. జవాన్కు తన కుటుంబ భద్రత, సౌకర్యాల గురించి ఆందోళన లేకపోతే, అతను సరిహద్దు భద్రత, దేశ సేవపై పూర్తి దృష్టి పెట్టగలడు. అందుకే కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బంది సంక్షేమం, వారికి మెరుగైన నివాస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం ముఖ్యమైన ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉంది. జవాన్లకు తగిన నివాస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఈ రోజు ప్రారంభిస్తున్న 48 నివాస గృహాలు కూడా ఆ ప్రయత్నంలో ఒక ముఖ్యమైన భాగం.
బహిరంగ సరిహద్దుల్లోని క్లిష్ట పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, అక్రమ వలసలు, నకిలీ కరెన్సీ, వన్యప్రాణులకు సంబంధించిన నేరాలు, ఇతర వ్యవస్థీకృత నేరాలను సమర్థవంతంగా అడ్డుకుంటున్న SSB జవాన్లపై భారత ప్రభుత్వానికి ఎంతో గర్వంగా ఉంది. సశస్త్ర సీమా బల్ ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం, ఆధునిక పద్ధతుల్లో సరిహద్దు నిర్వహణను తన ముఖ్యమైన ప్రాధాన్యతల్లో చేర్చుకోవడం నాకు సంతోషంగా ఉంది.
సరిహద్దుల్లో నిఘా, భద్రతను మరింత మెరుగుపరచడానికి డ్రోన్లు, CCTV నిఘా వ్యవస్థలు, థర్మల్ ఇమేజర్లు, నైట్ విజన్ పరికరాలు, GPS ఆధారిత గస్తీ, సురక్షిత డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థ, GIS ఆధారిత ప్రణాళిక వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. సశస్త్ర సీమా బల్లో 18 సహాయక, రక్షణ బృందాలు వివిధ అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు, అవసరమైనప్పుడు ప్రజలకు సహాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండటం నాకు సంతోషంగా ఉంది.
SSBలోని మొత్తం 18 సహాయక, రక్షణ బృందాలను, అలాగే విపత్తుల సమయంలో సేవలందిస్తున్న అన్ని సిబ్బందిని నేను అభినందిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఈ బృందాలు ఇదే అప్రమత్తత, సేవాభావం మరియు మానవతా దృక్పథంతో దేశ ప్రజలకు సేవ చేస్తాయని ఆశిస్తున్నాను. ప్రభుత్వం అందిస్తున్న వనరులను మన జవాన్ల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపయోగిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో, హోంమంత్రి మార్గదర్శకత్వంలో బలగాల ఆధునీకరణతో జవాన్ల సంక్షేమం, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు పూర్తిగా కట్టుబడి ఉంది. సైనికుల కుటుంబాలకు మంచి వైద్య చికిత్స, ఆధునిక గృహ వసతి, అలాగే వారి పిల్లలకు మంచి విద్య అందించేందుకు ఆధునిక పాఠశాలలు, క్రీడా పోటీలు నిర్వహించడంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. తద్వారా అన్ని అర్ధసైనిక బలగాలు మానసికంగా బలంగా ఉండి, మంచి సామర్థ్యంతో సమర్థవంతంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం.





