తెలంగాణ పోలీస్ అకాడమీలో రీజినల్ ఇన్వెస్టర్ సెమినార్

Must read

తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనీ అధికారులు, ఫ్యాకల్టీ సభ్యులు, అకాడమీ సిబ్బందికి , స్టాక్ మార్కెట్ పై అవగాహన, పెట్టుబడి మోసాల నివారణపై అవగాహన కల్పించే లక్ష్యంతో భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు (SEBI), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వారి ఆధ్వర్యం లో సంయుక్తంగా “రీజినల్ ఇన్వెస్టర్ సెమినార్”ను నిర్వహించారు. గురువారం సాయంత్రం తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీలు, ఫ్యాకల్టీ సభ్యులు, అకాడమీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీమతి అభిలాష్ బిస్త్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రైనీ అధికారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ సెమినార్‌కు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) శ్రీ కె.ఆర్.కె. ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరైన్నారు.

ఈ సందర్భంగా SEBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రామ్ మోహన్ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి జీవితంలో ఆర్థిక ప్రణాళికకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టడం, రిస్క్‌లను అంచనా వేసుకోవడం, చట్టబద్ధమైన మార్గాల్లోనే పెట్టుబడులు పెట్టడం ఎంతో అవసరమని సూచించారు. ప్రస్తుతం గూగుల్, మెటా వంటి డిజిటల్ వేదికలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి అనేక నకిలీ పెట్టుబడి పథకాలు, మోసపూరిత ప్రకటనలు ప్రచారంలోకి వస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సైబర్ నేరాలు, ఆన్‌లైన్ పెట్టుబడి మోసాలను అరికట్టడంలో ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత ప్రభావవంతమైన ఆయుధమని ఆయన పేర్కొన్నారు. NSE రీజినల్ మేనేజర్ శ్రీ రవి ఉప్పే మాట్లాడుతూ, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ముందు డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతా అవసరం, వాటి నిర్వహణ, పెట్టుబడి ప్రక్రియపై సవివరంగా వివరించారు.

ఇటీవలి కాలంలో పెరుగుతున్న డీప్‌ఫేక్ వీడియోలు, పంప్ అండ్ డంప్ స్కామ్‌లు, డబ్బా ట్రేడింగ్, నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, అనధికారిక పెట్టుబడి సలహాల వల్ల పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న మోసాల గురించి ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ తరహా మోసాల నుంచి ప్రజలను రక్షించేందుకు NSE చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు, నివారణ చర్యలను వివరించారు.

సెమినార్ సందర్భంగా పెట్టుబడిదారుల కోసం రూపొందించిన అతి సాయి సాథి యాప్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారం, పెట్టుబడి సంబంధిత సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలపై ట్రైనీలకు సమగ్ర అవగాహన కల్పించారు.సెమినార్ ముగింపు సందర్భంగా లైజన్ ఆఫీసర్ డీఎస్పీ శ్రీ ఆదూరి శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొన్న ట్రైనీ డీఎస్పీలు, అకాడమీ సిబ్బంది, SEBI, NSE ప్రతినిధులు, కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ .ఆర్.కె. ప్రసాద్, SEBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్ మోహన్, NSE బెంగళూరు రీజినల్ మేనేజర్ రవి ఉప్పే, కోఆర్డినేటర్ మరియు కంపెనీ సెక్రటరీ అభిలాష్ దరాక్, అకాడమీ ఔట్‌డోర్ AD రాంబాబు, డీఎస్పీలు సతీష్ కుమార్, తిరుపతి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు మహేష్, శ్రీను, ప్రవీణ్, శ్రీ నహేర్, ట్రైనీ డీఎస్పీలు, ఫ్యాకల్టీ సభ్యులు, కార్యాలయ సూపరింటెండెంట్లు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!