అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని, విఐటి-ఏపీ విశ్వవిద్యాలయంలో ఈగల్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణ, యువత సాధికారతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం,విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విద్యార్థులు, అధ్యాపకులు, పోలీసు అధికారులు, ఇతర ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి వంగలపూడి అనిత యువతను మాదకద్రవ్యాల వ్యసనం అనే ప్రమాదం నుండి రక్షించాల్సిన అత్యవసర అవసరాన్ని నొక్కిచెప్పారు. మాదకద్రవ్యాల వ్యసనం కేవలం సామాజిక సమస్య మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పని, ఇది యువతలోని ప్రతిభ, ఆరోగ్యం మరియు ఆశయాలను నాశనం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యలను ప్రశంసిస్తూ, రాష్ట్రం సాధించిన “జీరో గంజాయి సాగు” విజయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్రమ గంజాయి సాగు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్ల నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ, ముఖ్యంగా ఈగల్ బృందాలు నిరంతరం చేస్తున్న కృషిని ఆమె అభినందించారు.
మాదకద్రవ్యాల దుర్వినియోగ చరిత్రను ప్రస్తావిస్తూ, 1980ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య వేగంగా విస్తరించిందని, అప్పటి నుండి సమాజాలకు పెద్ద సవాలుగా మారిందని మంత్రి పేర్కొన్నారు. సంప్రదాయ, అసంప్రదాయ నేర ముఠాలు యువతను లక్ష్యంగా చేసుకుని వారి జీవితాలను మాత్రమే కాకుండా దేశ భద్రత, అభివృద్ధిని కూడా దెబ్బతీస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అత్యంత ముఖ్యమైన విజయాల్లో ఒకటిగా, గత మూడు నుండి నాలుగు దశాబ్దాలుగా ఏజెన్సీ ప్రాంతాలు మరియు ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (AOB) ప్రాంతాల్లో సుమారు 25 వేల ఎకరాల్లో సాగవుతున్న అక్రమ గంజాయి పంటను పూర్తిగా నిర్మూలించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. దీనిని చారిత్రాత్మక విజయంగా అభివర్ణిస్తూ, ఈ ఘనతకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ మరియు ఈగల్ బృందాల అంకితభావమే కారణమని కొనియాడారు.
ఈ సందర్భంగా ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ, ఐపీఎస్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ‘జీరో గంజాయి సాగు’ సాధన నిరంతర అమలు చర్యలు, నిఘా ఆధారిత ఆపరేషన్లు మరియు ప్రజల భాగస్వామ్య ఫలితం. మా లక్ష్యం కేవలం చట్ట అమలు మాత్రమే కాదు; యువత జీవితాలను రక్షించడం, సమాజంలో అవగాహన పెంపొందించడం, భవిష్యత్ తరాలను మాదకద్రవ్యాల ముప్పు నుండి కాపాడడం కూడా అని తెలియచేసారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఐపీఎస్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలపై పోరాటంపై విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, సమాజంలోని ప్రతి వర్గం కలిసి పనిచేయాలని, అవగాహన మరియు అప్రమత్తతే యువత భవిష్యత్తును రక్షించే అత్యంత శక్తివంతమైన ఆయుధాలని పేర్కొన్నారు.
ఈగల్ సెల్ ఎస్పీ నాగేశ్ బాబు కార్యక్రమంలో పాల్గొన్న వారితో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించి, మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణం, యువతలో ఆరోగ్యకర, బాధ్యతాయుత జీవనశైలిని ప్రోత్సహించేందుకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ సెల్ ఎస్పీ శస్వరూపారాణి, విఐటి-ఏపీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా|| జగదీష్ చంద్ర, డా|| ఖదీర్ పాషా డిప్యూటీ డైరెక్టర్ (స్టూడెంట్ వెల్ఫేర్) తదితరులు పాల్గొన్నారు.





