ప్రస్తుతం ఉన్న సమాజం మారినప్పుడే సుద్దాల హనుమంతు కోరుకున్న సమాజం నిర్మాణం ఆస్కారం అవుతుందని అందాల అశోక్ తేజ అన్నారు. సుద్దాల హనుమంతు 115వ జయంతి తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సాహితి సంయుక్తంగా సదస్సు, కవి సమ్మేళనం రవీంద్ర భారతి లోని సాహితీ కుటీరంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో సుద్దాల హనుమంతు ఒకరని గుర్తు చేశారు. నిజం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తులో ఒక్కరు. ఒక్కప్పుడు కనిపిస్తే కాల్చమని మా నాన్నగారిపై నజారాన ప్రకటించారు. అంతటి కఠినమైన పరిస్థితుల్లో కూడా తన ఉనికిని కోల్పోలేదు అన్నారు.
రావి నారాయణరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, మగ్దూం మొయినోద్దిన్, బి.ఎన్.రెడ్డి, మల్లు స్వరాజ్యం వంటి మహానీయులతో కలిసి పనిచేసారని తెలిపారు. అప్పటినుంచే విప్లవ గీతాలు రాసేవారు. అలా గన్నుతో, పెన్నుతో పోరాడిన గొప్ప విప్లవకారుడని అన్నారు. అలాంటివారి ఆశయ సాధన కోసం పని చేయాలన్న స్పృహ నేటి తరానికి కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
నేడు అవినీతి, ఆక్రమణలు, నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు, సామాజిక, ఆర్థిక విషయాలలో విచ్చలవిడి తనం అయిపోయాయని, సంస్కృతి భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రముఖ సాహితీవేత్త ఆచార్య మోతుకూరి నరహరి మాట్లాడుతూ సుద్దాల హనుమంతు రాసిన పాటలు అప్పటి భూస్వాములను, నిజాం నవాబులను వణుకు పుట్టించాయని అన్నారు.
అలాంటి సాహిత్య సృజన చేయాల్సిన అవసరం ఇంకావచ్చిందన్నారు. దరువు అంజన్న, దరువు ఎల్లన్న, తెలంగాణ సాహితి శరత్ సుదర్శి మాట్లాడుతూ సుద్దాల హనుమంతు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆనాడు పాటలు, జానపదాలు, డప్పులు, గజ్జెల ఆటలు శబ్దాలే ప్రజలను పోరాటాల్లోకి దింపాయని తెలిపారు.
ఈ కార్యక్రమానికి సాహిత్య అకాడమీ డైరెక్టర్ బాలాచారి అధ్యక్షత వహించగా కొండా రవీందర్ కవి సమ్మేళనం నిర్వహించారు. ప్రముఖ కవులు రచయితలు నాలేశ్వరం శంకరం, సలీమ, మేరెడ్డి, రేఖ, శ్రీసుధ కొలచన, రజినీ కులకర్ణి, రూపారుక్మిణి, శ్రీలతలతోపాటు 40 మంది కవులు హాజరయ్యారు.





