క్యూర్ ప‌రిధిలో ఇళ్ల డిజైన్ :మంత్రి పొంగులేటి

Must read

పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు సౌకర్యవంతమైన, భద్రమైన, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. పట్టణాల్లో జీవించే పేదవాడికి త‌న జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా గౌరవప్రదమైన జీవనం కల్పించాల‌నే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్‌కు అనుగుణంగా అర్బన్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.

క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో తొలి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణానికి ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రూపొందించిన పలు నమూనా డిజైన్లను పరిశీలించి పలు కీలక మార్పులు, సూచనలు చేశారు.

రానున్న 40 నుండి 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. కేవలం ఇళ్లు కట్టడం మాత్రమే కాదు భవిష్యత్ తరాలకు అనుకూలంగా ఉండే విధంగా డ్రైనేజీ వ్యవస్థ, పార్కింగ్, వాణిజ్య అవసరాలు, ప్రజల జీవనశైలిని దృష్టిలో పెట్టుకొని సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి అవసరమైతే 10 అంతస్తుల వరకు భవనాలు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

హాల్, బెడ్‌రూమ్, కిచెన్, బాత్‌రూమ్ వంటి విభాగాల పరిమాణాల రూపకల్పనలో వాస్తు అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పేద కుటుంబాలు సంతోషంగా, ఆత్మగౌరవంతో జీవించేలా ప్రతి డిజైన్ ఉండాలన్నారు. పార్కింగ్‌తో పాటు షాపుల ఏర్పాటుకు కూడా అవకాశం కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.

ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని, ఆ నియోజకవర్గ ప్రజలకు అదే ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రజలు తమ ఉపాధి, జీవన విధానాలకు దూరం కాకుండా నివాసాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించిన అనంతరం తుది డిజైన్లను ఖరారు చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించేలా రోజువారీ కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి పేద కుటుంబానికి సొంతింటి భద్రత కల్పించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచే అర్బన్ హౌసింగ్ మోడల్‌ను తీసుకొస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!