ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర గ్యాస్ సిలిండర్ పేలుడు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. గ్యాస్ పైపు నుంచి లీకైన వాయువు ఇళ్లంతా వ్యాపించి, పేలుడు సంభవించడంతో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం కాన్పూర్లోని ప్రత్యేక ఆసుపత్రికి తరలించారు.
ఈ విషాద ఘటన కల్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్ఖిని గ్రామంలో ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంతోష్ లోధి ఇంట్లో అతని భార్య కళావతి వంట పనుల్లో నిమగ్నమై ఉండగా గ్యాస్ పైపు నుంచి లీకేజీ ప్రారంభమైంది. మొదట్లో దీనిని ఎవరూ గమనించలేదు. కొద్ది నిమిషాల్లోనే గ్యాస్ ఇళ్లంతాఇంటంతా వ్యాపించి ప్రమాదకర స్థితికి చేరుకుంది.
అప్పటికే వంట కోసం ఉపయోగిస్తున్న మంట గ్యాస్కు తాకడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు తీవ్రతకు ఇంటి గోడలు దెబ్బతిన్నాయి. ఇంట్లో ఉన్న ఆరుగురు కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దం గ్రామమంతా మార్మోగడంతో స్థానికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.
ఇంట్లో నుంచి వినిపించిన ఆర్తనాదాలు విని గ్రామస్తులు వెంటనే సహాయక చర్యలకు దిగారు. మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ముగ్గురు యువకులు ధైర్యంగా ఇంట్లోకి వెళ్లగా, వారూ మంటలకు గురై తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మొత్తం గాయపడిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయింది. గాయపడిన వారిని మొదట స్థానిక ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పూర్ వైద్యశాలకు రిఫర్ చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో గ్యాస్ పైపు లీకేజీ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే సిలిండర్ పరిస్థితి, గ్యాస్ కనెక్షన్ భద్రత, వినియోగంలో నిర్లక్ష్యం వంటి అంశాలపై కూడా విచారణ కొనసాగుతోంది.
గ్రామంలో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గ్రామస్తులు ప్రభుత్వ సహాయం అందించాలని కోరుతున్నారు. ప్రమాద ఘటన నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు.
గ్యాస్ వాసన వచ్చిన వెంటనే విద్యుత్ స్విచ్లు ఆన్ చేయకూడదని, మంటలు వెలిగించకూడదని, వెంటనే తలుపులు, కిటికీలు తెరిచి గాలి ప్రసరణ కల్పించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.




