మావోయిస్ట్ పసునూరి నరహరి అలియాస్ సంతోష్ లొంగుబాటు

Must read

దేశంలో మావోయిస్టు ఉద్యమానికి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ దాదాపు మూడు దశాబ్దాల అజ్ఞాత జీవితానికి ముగింపు పలుకుతూ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ పరిణామం మావోయిస్టు వర్గాల్లో సంచలనం సృష్టించగా, భద్రతా సంస్థలు దీనిని కీలక విజయంగా భావిస్తున్నాయి.

హన్మకొండా జిల్లా కాజీపేట మండలం సోమిడికి చెందిన నరహరి, 1996 నుంచి మావోయిస్టు పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. గత 28 ఏళ్లుగా అండర్‌గ్రౌండ్‌లో ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన, క్రమంగా కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు. నరహరి తన భార్యతో కలిసి భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు. అధికారికంగా లొంగుబాటు ప్రక్రియ పూర్తిచేసిన తర్వాత ఆయనను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

మావోయిస్టు పార్టీలో అత్యంత కీలక నేతల్లో ఒకరిగా భావిస్తున్న నరహరి లొంగిపోవడం సంస్థకు గట్టి దెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సరందా అడవి ప్రాంతంలో భద్రతా బలగాలు భారీ స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా మావోయిస్టు పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిరి బెస్ర కోసం కేంద్ర బలగాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ ఒత్తిడి నేపథ్యంలోనే నరహరి లొంగిపోయినట్లు సమాచారం. ఇటీవల భద్రతా బలగాలు చేపడుతున్న ఆపరేషన్లతో మావోయిస్టు దళాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని అధికారులు చెబుతున్నారు. తెలంగాణకు చెందిన నరహరి, విద్యార్థి దశలోనే ఎడమ భావజాలానికి ఆకర్షితుడై మావోయిస్టు ఉద్యమంలో చేరినట్లు సమాచారం. అనంతరం అండర్‌గ్రౌండ్‌కు వెళ్లి పూర్తిస్థాయి కార్యకర్తగా మారారు.
కాలక్రమేణా పార్టీ అగ్రనాయకత్వానికి చేరుకున్న ఆయన పేరు భద్రతా సంస్థల జాబితాలో ప్రముఖంగా ఉండేది.

దీర్ఘకాల అజ్ఞాత జీవితం, అడవుల్లో కఠిన పరిస్థితులు, భద్రతా బలగాల ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు వంటి అంశాల కారణంగానే ఆయన లొంగిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో పలువురు మావోయిస్టు నేతలు కూడా ప్రభుత్వ పునరావాస విధానాలకు ఆకర్షితులై లొంగిపోతున్న విషయం తెలిసిందే.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!