తమిళనాడు రాజకీయాల్లో సినీ రంగం ప్రభావం కొత్త విషయం కాదు. ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత ఇప్పుడు సినీ నటుడు జోసెఫ్ విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీతో ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విజయ్, తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
చెన్నై విమానాశ్రయంలో రజనీకాంత్ మీడియా ప్రతినిధులకు కనిపించారు. ఈ సందర్భంగా విలేకరులు విజయ్ ముఖ్యమంత్రి కావడంపై ఆయన అభిప్రాయాన్ని అడిగారు. అయితే అందరూ ఊహించినట్లుగా రజనీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
ప్రశ్న విన్న వెంటనే ఆయన కేవలం చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయారు. ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా, స్పందన ఇవ్వకుండా వెళ్లిపోవడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
కొంతమంది అభిమానులు “రజనీ తన శైలిలో మౌనంగా అభినందనలు తెలిపారేమో” అంటుండగా, మరికొందరు “అనవసర రాజకీయ వివాదాలకు దూరంగా ఉండేందుకే స్పందించలేదు” అని అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు అయితే “రజనీ మౌనం కూడా ఒక సందేశమే” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
రజనీకాంత్ స్పందన తర్వాత సోషల్ మీడియాలో రజనీ, విజయ్ అభిమానుల మధ్య చర్చ మరింత వేడెక్కింది. “రజనీ ఎప్పుడూ పెద్దమనసుతో వ్యవహరిస్తారు” అని ఒక వర్గం అంటుండగా, “విజయ్ ఎదుగుదలను ఆయన గౌరవిస్తున్నారని” మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
తమిళనాడులో సినీ రంగం, రాజకీయాల మధ్య ఉన్న అనుబంధం కారణంగా ప్రతి చిన్న పరిణామం కూడా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. విజయ్ సీఎం కావడం, దానిపై రజనీకాంత్ స్పందించకపోవడం ఇప్పుడు తమిళనాడులో సినీ రాజకీయాలపై మరోసారి చర్చకు కారణమైంది. గతంలో రజనీ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి తర్వాత వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే.
రజనీకాంత్ చిరునవ్వుతో వెళ్లిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు ఆ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
“ఒక్క చిరునవ్వుతోనే చాలా చెప్పేశారు”, “రజనీ స్టైల్ ఇదే”, “మౌనం కూడా ఒక సమాధానం” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.





