నైరుతి బంగాళాఖాతంలో, ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతున్న ఈ అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. ఈ మేరకు ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖార్ జైన్ ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ చేశారు.
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర నుంచి దక్షిణాంధ్ర వరకు పలు జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
అదేవిధంగా కాకీనాడ, కోనసీమా, ఈస్ట్ గోదివరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, క్రృష్ణా, ఎన్టీ ఆర్ కడప, గుంటూరు, బాపట్ల తదితర జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
దక్షిణాంధ్ర ప్రాంతాల్లోని చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కూడా వర్ష సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఒకవైపు వర్ష సూచనలు ఉన్నప్పటికీ మరోవైపు రాష్ట్రంలో వడగాలుల ప్రభావం కూడా కొనసాగుతుందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జీకే వేది, ముంచింగిపుట్టు, పెద్దబయాలు మండలాల్లో వేడి గాలులు తీవ్రంగా వీచే అవకాశముందని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు పరిధిలోని చిత్తూరు, కూనవరం, మారెడిపల్లి, వీఆర్ పురం, గారేడు ప్రాంతాల్లో కూడా వడగాలుల ప్రభావం అధికంగా ఉండవచ్చని అధికారులు హెచ్చరించారు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వాతావరణ పరిస్థితులు వేగంగా మారే అవకాశముండటంతో రైతులు, మత్స్యకారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, అవసరం లేకపోతే బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అధిక వేడి నుంచి జాగ్రత్త పడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే వేసవి తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అల్పపీడనం కొంత ఉపశమనం కలిగించే అవకాశమున్నప్పటికీ, వర్షాలతో పాటు ఈదురుగాలులు, పిడుగులు కూడా ఉండే అవకాశముండటంతో అప్రమత్తత అవసరమని అధికారులు చెబుతున్నారు. వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.





