రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పెద్ది’ నుంచి కీలక అప్డేట్ విడుదలైంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామా ఎడిటింగ్ పనులు పూర్తయ్యాయని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సినిమా ఫైనల్ కట్ లాక్ అయ్యిందని, విడుదలకు సర్వం సిద్ధమైందని వెల్లడించింది.ఈ విషయాన్ని చిత్రబృందం తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించింది. “పెద్ది ఎడిట్ లాక్ చేయబడింది. 2026 జూన్ 3 నుంచి భారీ ప్రీమియర్లకు సిద్ధం. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది” అంటూ పోస్ట్ చేయడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తయినట్లు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు వెల్లడించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్తో కలిసి పనిచేయడం తనకు మరపురాని అనుభవమని, ఆయన అద్భుతమైన నటుడే కాకుండా గొప్ప వ్యక్తిత్వం కలిగిన స్నేహితుడని ప్రశంసించారు. తెరపై పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా, వ్యక్తిగతంగా ఎంతో ఆత్మీయంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు.సినిమాలోని చివరి పాటను ఏప్రిల్ 29న చిత్రీకరించినట్లు సమాచారం. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాట సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో భారీ సెట్లో ఈ పాటను తెరకెక్కించారని, ఇందులో ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉండబోతుందని సమాచారం. ఈ పాట తప్పకుండా చార్ట్బస్టర్ అవుతుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
‘పెద్ది’ ప్రాజెక్ట్ ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే శివ రాజ్కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.సినిమాటోగ్రఫీని రత్నవేలు అందిస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలను నవీన్ నూలి నిర్వహించారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్షన్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్, స్టార్ క్యాస్ట్, గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథతో రూపొందుతున్న ఈ సినిమాపై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.





