ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించడమే కాకుండా, మారుతున్న సాంకేతికతను సమర్థవంతంగా అందిపుచ్చుకుని డిజిటల్ సేవల్లో ముందంజలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది.
2026 సంవత్సరానికి గాను “PSE టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్స్” కు APSRTC ఎంపికైంది. సంస్థలోని యూనిఫైడ్ కమ్యూనికేషన్స్ విభాగంలో డిజిటల్ సేవల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడంకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.
హైదరాబాద్లో ఏప్రిల్ 24, 25 తేదీలలో నిర్వహించిన ఇండియా PSE సమ్మిట్ – 2026 సందర్భంగా ఈ అవార్డులు ప్రదానం చేయబడ్డాయి. దేశవ్యాప్తంగా ప్రజా రంగ సంస్థల్లో ప్రతిభ, ఆవిష్కరణలు, డిజిటల్ మార్పులకు ఈ సమ్మిట్ వేదికగా నిలిచింది.
సాంకేతికత వినియోగం, కార్యనిర్వహణ సామర్థ్యం, వినియోగదారుల సేవల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన సంస్థలకు ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు. పరిశ్రమ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, ప్రజా రంగ ప్రతినిధులు పాల్గొని ఉత్తమ విధానాలు, సరికొత్త ఆవిష్కరణలను పంచుకున్నారు.
హైదరాబాద్లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో, సంస్థ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్. బాల సుబ్రమణ్యం, ఐ.పి.ఎస్. తరపున చీఫ్ ఇంజనీర్ (ఐటి) శ్రీ వై. శ్రీనివాసరావు ఈ అవార్డును ఎక్స్ప్రెస్ కంప్యూటర్ ఎడిటర్ శ్రీ పి. శ్రీకాంత్ చేతుల మీదుగా అందుకున్నారు.
ఈ సందర్భంగా VC & MD శ్రీ ఎన్. బాల సుబ్రమణ్యం, ఐపీఎస్ హర్షం వ్యక్తం చేస్తూ, ఈ విజయానికి కృషి చేసిన అధికారులను, సూపర్వైజర్లను, సిబ్బందిని అభినందించారు.అలాగే, సంస్థ ఇప్పటికే అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుందని, ముఖ్యమంత్రి విజన్కు అనుగుణంగా సంస్థ సిబ్బంది అందరూ అంకితభావంతో పనిచేసి APSRTCను అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రయాణికుల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.





