నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ మరణాన్ని “ప్రభుత్వ హత్య”గా అభివర్ణిస్తూ ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు.
కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్, రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించాల్సిన బదులు, కమిటీలు వేసి కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆయన పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మికులు తమకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలును మాత్రమే కోరుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ హామీ అమలు చేయడంలో జాప్యం జరుగుతుండటంతో కార్మికుల్లో అసంతృప్తి పెరిగిందని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. అప్పటి ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. కార్మికుల సమస్యలు ఏ ప్రభుత్వంలోనూ పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమన్నారు.
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో న్యాయం ఉందని ఆయన స్పష్టం చేశారు. వారి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్మికుల సంక్షేమం కోసం సరైన విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
బండి సంజయ్ కార్మికులకు ఒక కీలక విజ్ఞప్తి కూడా చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆత్మహత్య వంటి తీవ్రమైన చర్యలకు పాల్పడవద్దని కోరారు. “మీ కుటుంబాల గురించి ఆలోచించండి. మీ ప్రాణాలు అమూల్యమైనవి” అంటూ భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, రెండు పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లిస్తామని కాంగ్రెస్ తన ‘అభయహస్తం’ హామీల జాబితాలో పేర్కొందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారని తెలిపారు. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతిస్తామని కూడా చెప్పి ఇప్పుడు ఇటు ప్రజలను ఆటు ఆర్టీసి కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నరని ఆవేదన వ్యక్తం చేశారు.





