ప్రధాని అన్నీ అబద్ధాలే చెప్పారు :ఖర్గే

Must read

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశాన్ని ఉద్దేశించి ప్రధాని చేసిన తాజా ప్రసంగాన్ని పూర్తిగా రాజకీయ వేదికగా మార్చేశారని ఆయన ఆరోపించారు.

గత 12 ఏళ్ల పాలనలో చెప్పుకోదగిన విజయాలు లేకపోవడం వల్లే ఈ విధంగా రాజకీయ విమర్శలకు దిగుతున్నారని ఖర్గే అన్నారు. జాతిని ఉద్దేశించి చేసే అధికారిక ప్రసంగం సాధారణంగా ప్రజల సమస్యలు, అభివృద్ధి, భద్రత వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు.

కానీ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని విపక్షాలపై విమర్శలు చేయడానికి ఉపయోగించారని ఆయన విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధమని, రాజ్యాంగ విలువలను దిగజార్చే చర్యగా అయన అభివర్ణించారు.

ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఖర్గే ఆరోపించారు. విపక్ష పార్టీలపై బురదజల్లడం, అసత్య ఆరోపణలు చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి హానికరమని ఆయన పేర్కొన్నారు. “పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది” అని ఆయన అన్నారు.

ప్రధాని తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీని సుమారు 59 సార్లు ప్రస్తావించారని ఖర్గే గుర్తు చేశారు. అయితే మహిళల సమస్యలపై మాత్రం కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే మాట్లాడారని ఆయన విమర్శించారు. దీని ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో స్పష్టంగా తెలుస్తుందన్నారు.

మహిళా సాధికారత విషయంలో కూడా బీజేపీ ప్రభుత్వం వైఖరిని ఖర్గే ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ ఎప్పటినుంచో ముందుండి పోరాటం చేస్తోందని చెప్పారు.

2010లో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే ఆ బిల్లును లోక్‌సభలో ఆమోదింపజేయడంలో బీజేపీ విఫలమైందని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చరిత్రలో సరైన వైపునే నిలబడిందని, ప్రజల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ, సమానత్వం వంటి విలువలను కాపాడడంలో కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇకపై కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి తమ పోరాటం కొనసాగుతుందని ఖర్గే స్పష్టం చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!