టాలీవుడ్లో క్రేజీ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం రణబాలి షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ రాయలసీమలో పూర్తి కావడం విశేషం.
ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ Mythri Movie Makers
అధికారికంగా ప్రకటించింది. రాయలసీమ ప్రజలు తమపై చూపిన ప్రేమ, ఆదరణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షూటింగ్ సందర్భంగా అభిమానులతో మాట్లాడిన విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నాకు ఇక్కడికి వస్తే నా సొంత ఊరికి వచ్చిన భావన కలుగుతోంది. అనంతపురం నా రెండో స్వస్థలంలా అనిపిస్తోంది. నాలో ఎప్పుడూ ఒక సీమ ఫీలింగ్ ఉంటుంది” అని అన్నారు. ఆయన మాటలు అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయనకు జంటగా రష్మిక మందన్న ‘జయమ్మ’ పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ జంట గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించి మంచి విజయాన్ని సాధించడంతో, ఈ మూడో సినిమా రణబాలిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ 19వ శతాబ్దంలోని బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ముఖ్యంగా 1854 నుండి 1878 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించారని తెలుస్తోంది. చరిత్రలో గుర్తింపు పొందని, బ్రిటిష్ వర్ణనలో తప్పుగా నిలిచిన సంఘటనలను ఈ సినిమాలో చూపించనున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. అతని పాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును T-Series
సమర్పిస్తోంది. అన్ని భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.





