‘నేషనల్ క్రష్’గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న మరోసారి అంతర్జాతీయ వేదికపై తన క్రేజ్ను చాటుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన క్రంచీరోల్ యానిమే అవార్డ్స్లో ప్రజెంటర్గా వ్యవహరించేందుకు ఆమె ఎంపికయ్యారు.ఈ ప్రతిష్టాత్మక అవార్డ్స్ వేడుక మే 23న జపాన్లోని గ్రాండ్ ప్రిన్స్ హోటల్ షిన్ టకనవాలో అట్టహాసంగా జరగనుంది. ఇది ఈ అవార్డ్స్ 10వ వార్షికోత్సవ వేడుక కావడం ప్రత్యేకత. రష్మిక ఈ వేదికపై ప్రజెంటర్గా కనిపించడం ఇది రెండోసారి కావడం విశేషం.
ఈ విషయాన్ని రష్మిక తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ, “మళ్లీ జపాన్కు వెళ్లి యానిమే ప్రపంచాన్ని సెలబ్రేట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు. గతంలో 2024లో జరిగిన వేడుకలో తొలిసారి ప్రజెంటర్గా పాల్గొని, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సెలబ్రిటీగా చరిత్ర సృష్టించారు.ఈసారి కూడా ఆమెకు అదే గౌరవం దక్కడం గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఆమె స్థాయిని మరోసారి నిరూపిస్తోంది. ఈ వేడుకలో అసుకా సైతో, డానా పవోలా, విన్స్టన్ డ్యూక్ వంటి అంతర్జాతీయ ప్రముఖులతో కలిసి ఆమె వేదికను పంచుకోనున్నారు.
రష్మికకు యానిమేషన్ ప్రపంచంతో మంచి అనుబంధం ఉంది. జుజుట్సు కైసెన్, డీమన్ స్లేయర్ వంటి యానిమే షోలు తనకు ఎంతో ఇష్టమని ఆమె పలుమార్లు వెల్లడించారు. ప్రస్తుతం భారతదేశంలో క్రంచీరోల్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఆమె కొనసాగుతున్నారు.ఇక సినిమాల విషయానికి వస్తే, రష్మిక ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. షాహిద్ కపూర్, కృతి సనన్లతో కలిసి నటించిన ‘కాక్టెయిల్ 2’ జూన్ 19న విడుదల కానుంది. అలాగే విజయ్ దేవరకొండతో కలిసి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘రణబాలి’ అనే పీరియడ్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు.
ఇవే కాకుండా గిరిజన నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘మైసా’ అనే యాక్షన్ డ్రామా కూడా ఆమె చేతిలో ఉంది. ఒకవైపు ప్రాంతీయ సినిమాల్లో అగ్రతారగా కొనసాగుతూనే, మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు సంపాదిస్తూ రష్మిక ముందుకు సాగుతున్నారు.





